ఫిరోజాబాద్ (యూపీ), జూన్ 1: ‘న్యాయంలో జాప్యం న్యాయం జరగకపోవడమే’ అన్న నానుడిని నిజం చేసేలా ఉత్తరప్రదేశ్లో సామూహిక హత్య కేసులో ఒక నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇంతకీ ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటానికి కోర్టుల్లో కేసు 42 ఏండ్ల పాటు విచారణ జరుగగా, ఇప్పుడు నిందితుని వయసు 90 ఏండ్లు. కేసు వివరాల్లోకి వెళ్తే..
యూపీలో షికోహబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాద్పూర్ గ్రామంలో డిసెంబర్ 1981లో దళిత వర్గానికి చెందిన పది మందిపై సామూహిక దాడి చేసి చంపినందుకు నిందితులుగా పేర్కొంటూ పది మందిపై కేసు నమోదైంది. కేసు 42 ఏండ్ల పాటు సుదీర్ఘకాలం నడిచింది. చివరిగా 2021లో ఫిరోజాబాద్ జిల్లా కోర్టుకు వచ్చింది. వాదోపవాదాల అనంతరం కోర్టు నిందితుడికి గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.