కోల్కతా: నేరం రుజువు కాకున్నా 41 ఏండ్లు జైలు జీవితం గడిపాడో వ్యక్తి. నేపాల్కు చెందిన దుర్గాప్రసాద్ తిమ్సినా అలియాస్ దీపక్ జోషి 1980 మే 12న ఓ మహిళ హత్య కేసులో డార్జిలింగ్లో అరెస్టయ్యాడు. ఆ కేసు విచారణ కూడా జరగలేదు. అయినా.. అతడు 4 దశాబ్దాల పాటు జైల్లోనే మగ్గిపోయాడు. ఆ సమయంలో దీపక్ జోషి వయసు 20 ఏండ్లు. ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి చెప్పటంతో డార్జిలింగ్ వచ్చిన దీపక్ను ఆ వ్యక్తే కేసులో ఇరికించాడు. అప్పటి నుంచి పలు జైళ్లలో గడు పుతూ.. చివరకు పశ్చిమ బెంగాల్లోని డుమ్ డుమ్ సెంట్రల్ జైలుకు చేరాడు. అతడి పరిస్థితి విన్న తోటి ఖైదీ,. తన స్నేహితుల ద్వారా నేపాల్ రేడియో క్లబ్కు సమాచారాన్ని చేరవేశాడు. వాళ్లు దీపక్ కుటుంబ సభ్యుల గురించి ఆరాతీయగా, తూర్పు నేపాల్లోని లుబంక్లో అతడి తల్లి ఉందని తెలిసింది. ఆమె నేపాల్ కాన్సులేట్ అధికారులను సంప్రదించగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న కలకత్తా హైకోర్టు.. వెంటనే దీపక్ను విడుదల చేసి, బంధువులకు అప్పగించాలని స్పష్టం చేసింది. 41 ఏండ్ల పాటు విచారణ చేయకుండా జైల్లోనే ఉంచినందుకు అతడికి పరిహారం కింద రూ.5 లక్షలు చెల్లించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.