Gujarat | అహ్మదాబాద్, మే 7: ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం సృష్టిస్తున్న వేళ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా సొంత రాష్ట్రం గుజరాత్లో వేల మంది మహిళలు అదృశ్యమయ్యారనే విషయం సంచలనంగా మారింది. గత ఐదేండ్లలో 40 వేల మందికి పైగా మహిళలు, బాలికలు కనిపించకుండా పోయారట. ఇది ఎవరో చెప్పింది, ఇంకెవరో ఆరోపణలు చేసింది కాదు.. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలోని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. 2016 నుంచి 2020 మధ్య ఐదేండ్ల వ్యవధిలో 41,621 మంది అదృశ్యం అయ్యారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. వీరిలో కొంతమందిని మానవ అక్రమ రవాణా గ్రూపులు ఇతర రాష్ర్టాలకు తరలించి వ్యభిచార కూపంలోకి దించాయనే వాదనలు ఉన్నాయి. కేరళ గురించి మాట్లాడే బీజేపీ నేతలు గుజరాత్లో వేల మంది మహిళల అదృశ్యంపై ఏం చెప్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి హిరేన్ బంకర్ ప్రశ్నించారు. మహిళల అదృశ్యం విషయాన్ని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో ఒప్పుకొన్నది.
మహిళల మిస్సింగ్పై మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు సుధీర్ సిన్హా కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని మిస్సింగ్ కేసుల్లో.. మహిళలు, బాలికలను ఇతర రాష్ర్టాలకు తరలించి బలవంతంగా వ్యభిచారంలోకి దించడాన్ని తాను గమనించానని పేర్కొన్నారు. మిస్సింగ్ కేసులను పోలీసులు సీరియస్గా తీసుకోవడం లేదని, ఈ కేసులు హత్యల కంటే తీవ్రమైనవని అభిప్రాయపడ్డారు.