రాంచీ: రోడ్డు పక్కన అమ్మే షాపులోని పానీపూరీ (Gol Gappa) తిన్న వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా ప్రాంతంలో వీధి వ్యాపారి అమ్మే పానీపూరీలను పిల్లలు, మహిళలు తిన్నారు. అనంతరం వారంతా వాంతులు, విరోచనాలతో అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపథ్యంలో సుమారు 40 మంది పిల్లలు, పది మంది మహిళలను కోడెర్మాలోని సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, కలుషిత ఆహారం తినడం వల్ల వారంతా అస్వస్థత చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. అనారోగ్యంపాలైన వారిలో 9-15 ఏళ్ల వయసు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. అందరినీ ఒక రోజంతా పరిశీలనలో ఉంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
మరోవైపు ఆ వీధి వ్యాపారి నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కోసం రాంచీలోని ల్యాబ్కు పంపినట్లు చెప్పారు. ఫుడ్ పాయిజన్ వల్లనే 40 మంది పిల్లలు, పది మంది మహిళలు అస్వస్థత చెందినట్లు వెల్లడించారు.