న్యూఢిల్లీ: ఐదంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో నలుగురు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో పది మందిని రక్షించారు. సుమారు 16 గంటలకుపైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. (Delhi Building Collapse) దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఐదు అంతస్తుల భవనం శనివారం సాయంత్రం కూలిపోయింది. పోలీసులు, అధికారులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు పది మందిని కాపాడారు. నలుగురు వ్యక్తుల మృతదేహాలను బయటకు తీశారు.
కాగా, కూలిన ఐదంతస్తుల బిల్డింగ్లో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్, కేఫ్లు, పలు కార్యాలయాలు ఉన్నాయి. పని దినాల్లో ఆ భవనంలో సుమారు 200 నుంచి 300 మంది వరకు ఉద్యోగులు ఉండేవారని స్థానికులు తెలిపారు. వారాంతం కావడంతో ఎక్కువ మంది మరణించే ప్రమాదం తప్పిందని చెప్పారు. ఆ బిల్డింగ్ పై అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.
మరోవైపు వైద్య ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తరచుగా వచ్చే బిల్డింగ్ పక్కనే ఉన్న రేకుల షెడ్డు క్యాంటీన్పైనా శిథిలాలు పడ్డాయి. దీంతో ఎంత మంది చిక్కుకున్నారో అన్నది తెలియడం లేదు. భారీ యంత్రాలు, హైడ్రాలిక్ కట్టర్లు, కెమెరాలు, జాగిలాల ద్వారా శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆదివారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పరిసరాల్లోని శిథిలావస్థలో ఉన్న, ప్రమాదకరమైన భవనాలను తనిఖీ చేసి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులపైనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కూలిన బిల్డింగ్ యజమానిపై మానవ హత్యతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.