న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక విధానాన్ని అమలు చేయనున్నది. దాని ప్రకారం ఉద్యోగులు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేసే వీలు ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త కార్మిక విధానం అమలు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జీతాలు, సామాజిక భద్రత, పరిశ్రమల సంబంధాలు, ఉద్యోగ రక్షణ, ఆరోగ్యం, పనిచేసే పరిస్థితులపై నాలుగు కొత్త లేబర్ కోడ్లను కేంద్రం ప్రవేశపెట్టనున్నది. అయితే ఈ కోడ్లకు చెందిన రూల్స్ను ఇప్పటికే కేంద్రం ఫైనలైజ్ చేసింది. అయితే కార్మిక వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కాబట్టి, దానికి సంబంధించిన మార్పులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాల్సి ఉంటుంది. 2022-23 నుంచి కొత్త లేబర్ చట్టాలు అమలు అయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు ఓ ప్రభుత్వ నివేదిక ద్వారా వెల్లడైంది.
వారానికి 4 రోజుల పనిదినాలు అంటే ఆ వారంలో ఉద్యోగి మూడు రోజులు హాలీడేలో ఉండవచ్చు. కానీ 4 రోజులు ఆ ఉద్యోగులు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. వారానికి 48 గంటల పని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో టేక్ హోమ్ జీతాన్ని కూడా తగ్గించనున్నారు. ఇలాంటి వాళ్లకు అధిక స్థాయిలో పీఎఫ్ ఇవ్వాలని నిర్ణయించారు. పీఎఫ్ల్లో ఎక్కువ జమా అవుతాయి, ఇక చేతికి వచ్చే సాలరీ తగ్గనున్నట్లు తెలుస్తోంది.