హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): న్యాయం కోసం కోర్టులకు వెళ్లిన వాళ్లు ఏండ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. జిల్లా, సబార్డినేట్ వంటి కింది కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 4.18 కోట్లకు చేరింది. గడిచిన ఐదు సంవత్సరాల్లోనే కింది కోర్టుల్లో (సుప్రీంకోర్టు, హైకోర్టులు మినహా) 1.08 కోట్ల కేసులు పెండింగ్లో పడ్డాయి. అపరిష్కృతంగా ఉండిపోయిన మొత్తం కేసుల్లో ఇవి 25 శాతం. పెండింగ్ కేసుల గణాంకాలను నేషనల్ జ్యుడిషియల్ డాటా గ్రిడ్ (ఎన్జేడీజీ) తాజాగా విడుదల చేసింది.
ఉత్తరాది ఘోరం.. దక్షిణాది నయం
పెండింగ్ కేసుల విషయంలో ఉత్తరాది రాష్ర్టాల పరిస్థితి దారుణంగా ఉన్నది. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో ఎక్కువ కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. తెలుగు రాష్ర్టాలు సహా దక్షిణాది రాష్ర్టాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నది.