ముంబై: కలుషితమైన రక్తం మార్పిడి వల్ల నలుగురు పిల్లలకు హెచ్ఐవీ సోకింది. వారిలో ఒకరు మరణించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంఘటన జరిగింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఇటీవల రక్త మార్పిడి జరిగింది. అయితే రక్త కేంద్రం లేకపోవడంతో కలుషిత రక్తాన్ని వారికి ఎక్కించారు. దీంతో నలుగురు పిల్లలకు హెచ్ఐవీ సోకింది. వీరిలో ఒకరు చనిపోవడం కలకలం రేపింది.
గురువారం మీడియాలో వచ్చిన ఈ వార్తా కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. మానవ హక్కుల ఉల్లంఘనపై మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫుడ్, డ్రగ్స్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు మధ్యంతర పరిహారం, హెచ్ఐవీ సోకిన పిల్లలకు సరైన వైద్యం అందించాలని కోరింది. వీటిపై తీసుకున్న చర్యలపై ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో ఐదుగురికి హెపటైటిస్ సీ, ఇద్దరికి హెపటైటిస్ బీ సోకినట్లు వెల్లడించింది.