న్యూఢిల్లీ: ఆరు నెలల కాలంలో నలుగురు బీజేపీ సీఎంలు రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంతో సీఎంల మార్పు మొదలైంది. సుమారు నాలుగేండ్లపాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ ఈ ఏడాది మార్చి 10న తన పదవికి రాజీనామా చేశారు. అదే రోజున తీరత్ సింగ్ రావత్ కొత్త సీఎంగా ప్రమాణం చేశారు. 116 రోజులు సీఎంగా ఉన్న ఆయన ఈ ఏడాది జూలై 4న అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఊహించని విధంగా పుష్కర్ సింగ్ ధామి అదే రోజున కొత్త సీఎంగా ప్రమాణం చేశారు. దీంతో ఉత్తరాఖండ్లో కొన్ని నెలల తేడాతో ఇద్దరు సీఎంలు రాజీనామా చేశారు.
ఈ ఏడాది జూలై 26న కర్ణాటక సీఎం బీఎస్ ఎడియూరప్ప చాలా బాధతో తన పదవికి రాజీనామా చేశారు. ఆ పదవిలో ఆయన రెండేండ్లు పూర్తి చేసుకున్నారు. అదే నెల 28న బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తాజాగా నాలుగేండ్ల పాటు గుజరాత్ సీఎంగా ఉన్న విజయ్ రూపానీ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. కొత్త సీఎం రేసులో నలుగురు నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, ఎంపీ సీఆర్ పాటిల్, మరో కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలా పేర్లు వినిపిస్తున్నాయి.
కాగా, ఈ ఏడాది తొలుత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్పుపైనా బలమైన ఊహాగానాలు వినిపించాయి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసంతృప్తిని ఆయన ఎదుర్కొన్నారు. కాగా, బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత సీఎం యోగిని మార్చబోమని ఆ పార్టీ స్పష్టం చేసింది.
మరోవైపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తోపాటు గుజరాత్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సీఎంల సారథ్యంలో ఎన్నికలకు వెళ్లేందుకు పాత సీఎంలను బీజేపీ బలవంతంగా రాజీనామా చేయిస్తున్నట్లు తెలుస్తున్నది.