న్యూఢిల్లీ: సాఫ్ట్డ్రింక్స్లో వాడే ఆస్పర్టేమ్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ను అతిగా వినియోగిస్తే క్యాన్సర్ బారిన పడే ప్రమాదమున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో, లోకల్ సర్కిల్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారిలో 38 శాతం మంది ప్రతి నెలా కృత్రిమ చక్కెరలను వాడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.
చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడే ఆస్పర్టేమ్.. సుక్రోజ్ కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. డైట్డ్రింక్స్, చూయింగ్గమ్, టూత్పేస్ట్, ఐస్క్రీమ్ తదితర వాటిల్లో దీనిని వినియోగిస్తారు. ఆస్పర్టేమ్తో పాటు మరో ఐదు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ల వినియోగానికి భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ అనుమతిచ్చింది.
పట్టణ ప్రజల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ను వాడుతున్నట్టు లోకల్ సర్కిల్ సర్వేలో తేలింది. ఆర్టిఫియల్ స్వీట్నర్స్ ఉన్న డైట్సోడా డ్రింక్స్ను 32 శాతం మంది, ఎనర్జీ డ్రింక్స్ను 26 శాతం మంది, షుగర్ ఫ్రీ గమ్స్ను 32 శాతం, షుగర్ ఫ్రీ చాకొలెట్స్ను 18 శాతం, షుగర్ఫ్రీ ఐస్క్రీమ్స్ 18 శాతం మంది, ఎనర్జీ బార్స్ను 5 శాతం మంది ప్రతినెలా వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. తయారీ సంస్థలు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వివరాలను తమ ఉత్పత్తులపై ప్రముఖంగా ముద్రించాలని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్తో బరువు తగ్గరని, పైగా వీటి వాడకంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డబ్ల్యూహెచ్వో గత మేలో హెచ్చరించింది.