కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని ఆ పార్టీ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి తమ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో నేరుగా సంప్రదిస్తున్నారని అన్నారు. నటుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మిథున్ చక్రవర్తి బుధవారం కోల్కతాలో మీడియాతో మాట్లాడారు. ‘మీరు బ్రేకింగ్ న్యూస్ వినాలనుకుంటున్నారా? ఈ సమయంలో ఇక్కడ కూర్చొన్న మాతో 38 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. వారిలో 21 మంది ప్రత్యక్షంగా నాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక మిగతాది మీ అంచనా కోసం మీకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరిన్ని వివరాలను మీడియా కోరగా ‘ట్రైలర్ను విడుదల చేయమని నన్ను అడగవద్దు. సంగీతాన్ని ఆస్వాదించండి’ అని వ్యాఖ్యానించారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘ఆపరేషన్ లోటస్’ను అమలు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నదని సీఎం మమతా బెనర్జీ ఇటీవల విమర్శించారు. అయితే మహారాష్ట్రలో మాదిరిగా బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవని అన్నారు. దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలంటూ బీజేపీకి సవాల్ విసిరారు. ‘మహారాష్ట్ర ఈసారి యుద్ధం చేయలేకపోయింది. మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బెంగాల్ అని అంటున్నారు. ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి. మీరు బంగాళాఖాతం దాటాలి. మొసళ్ళు మిమ్మల్ని మింగుతాయి. సుందర్బన్స్లోని రాయల్ బెంగాల్ టైగర్స్ మిమ్మల్ని కొరుకుతాయి. ఉత్తర బెంగాల్లోని ఏనుగులు మీపై దొర్లుతాయి’ అని ఘాటుగా అన్నారు.
#WATCH | West Bengal: Do you want to hear breaking news? At this moment, 38 TMC MLAs have very good relations with us, out of which 21 are in direct (contact with us): BJP leader Mithun Chakraborty in Kolkata pic.twitter.com/1AI7kB4H5I
— ANI (@ANI) July 27, 2022