చెన్నై: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. మలేషియా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో కన్నుమూశారు. తమిళనాడులోని పుదుకోట్టయ్ జిల్లా నరియపట్టికి చెందిన 36 ఏండ్ల ఏ. వేళుమురగన్.. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో స్వస్థలానికి బయలుదేరారు. ఈ క్రమంలో విమానం సీటులోనే విగతజీవిగా ఉండటాన్ని గమనించిన తోటి ప్రయాణికులు విమాన సిబ్బందిని అప్రమత్తం చేశారు.
దీంతో వారు తిరుచ్చి విమానాశ్రయానికి సమాచారం అందించారు. విమానం అప్పటికి తిరుచ్చికి 60 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. ప్లెయిన్ విమానాశ్రయంలో దిగిన వెంటనే వైద్య సిబ్బంది అతడిని పరీక్షించారు. వేళుమురుగన్ అప్పటికే మృతిచెందాడని ధృవీకరించారు. దీంతో అతని మృతదేహాన్ని తిరుచ్చిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతని మృతికిగల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోస్టుమార్టం అనంతరం పూర్తివివరాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.