న్యూఢిల్లీ: ఎర్రకోట కారు పేలుడు(Red Fort Blast) ఘటన తర్వాత దర్యాప్తు ఏజెన్సీలు కొత్త విషయాన్ని పేర్కొన్నాయి. వైట్కాలర్ ఉగ్రవాదులు భారీ కుట్ర ప్లాన్ వేసినట్లు గుర్తించారు. పేలుడు పదార్ధాలతో ప్యాక్ చేసిన 32 వాహనాలను ఉగ్రవాదులు సిద్ధం చేసేందుకు ప్లాన్ వేసినట్లు దర్యాప్తు అధికారులు పసికట్టారు. పలు నగరాల్లో ఆ వాహనాలను దాడుల కోసం వాడాలని భావించారు. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన కారు పేలుడు ఘటనలో 13 మంది మృతిచెందారు. ఐ20, ఎకోస్పోర్ట్ కార్లను తమ ప్లాన్లో భాగంగా మాడిఫై చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సీరియల్ పేలుళ్లకు పాల్పడాలన్న ఉద్దేశంతో మరిన్ని వాహనాలను పేలుడు పదార్ధాలతో నింపేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
మొత్తం 32 వాహనాల్లో పేలుడు పదార్ధాలను నింపాలని అనుమానిత ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 8 మంది అనుమానితులు సుమారు నాలుగు లొకేషన్లలో పేలుడుకు పాల్పడాలని భావించినట్లు తెలుస్తున్నది. పేలుడు పదార్ధాలను కొనుగోలు చేసేందుకు వైట్కాలర్ డాక్టర్లు సుమారు 26 లక్షల నిధి సేకరించినట్లు తెలుస్తున్నది.
అనుమానితులు డాక్టర్ ముజమ్మిల్ గన్నై, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ షహీన్ సయ్యిద్, డాక్టర్ ఉమర్ నబీ ఆ డబ్బును పోగు చేశారు. అయితే ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఆ డబ్బును డాక్టర్ ఉమర్ వాడినట్లు తెలుస్తున్నది.