ఉన్నావ్, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అడ్డదారులు తొక్కుతున్నది. ఆ రాష్ట్రంలో అనేకమంది ప్రజలకు టీకాలు వేయకుండానే వేసినట్టు తప్పుడు సందేశాలు వస్తున్నాయి. అంతేకాకుండా అక్రమంగా భారీ మొత్తంలో దాచిన అన్ రిజిస్టర్డ్ వ్యాక్సిన్ డోసులు బయటపడ్డాయి. ఉన్నావ్ జిల్లాలోని మియాగంజ్ ఏరియాలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అక్కడ కోల్డ్ స్టోరేజ్ వెలుపల దాచిన 3 వేలకుపైగా వ్యాక్సిన్ డోసులను గుర్తించారు. మియాగంజ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో ఉపయోగించాల్సిన ఈ వ్యాక్సిన్ డోసులను అనుమానాస్పద స్థితిలో ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్నారు. ఇవి కోల్డ్ స్టోరేజీలో లేకపోవడం స్థానికులతోపాటు జిల్లా అధికారుల్లో కలకలం సృష్టించింది. అనంతరం సఫీపూర్ ఎమ్మెల్యే బంబాలాల్ దివాకర్ (బీజేపీ) ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఉదంతంపై ఉన్నతాధికారులతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం దర్యాప్తునకు ఆదేశించింది.