చెన్నై : తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో విషాదం నెలకొంది. ఓ ప్రయివేటు పాఠశాలలో మూత్రశాల గోడ కూలి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన విద్యార్థులు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. విద్యార్థులు మృతి చెందడంతో.. తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.