శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కుప్వారా (Kupwara) జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందడటంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ చెప్పారు.
ఉగ్రవాదులను పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు చెందినవారిగా గుర్తించామన్నారు. వారు ఎవరనేది తెలుసుకుంటున్నామని తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
కాగా, బుధవారం రాత్రి బుద్గాం జిల్లా చదూరలో ఓ టీవీ నటిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో టీవీ నటి అమ్రీన్ భట్ తన మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ (10)తో కలిసి ఇంటి బయట ఉండగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆమె మరణించగా, తీవ్రంగా గాయపడిన జుబైర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
బుధవారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీసు కూడా వీర మరణం పొందిన విషయం తెలిసిందే.