లక్నో: అతివేగంగా వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ టీ స్టాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టీ కొట్టులో ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని షహనాజ్పూర్లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం షహనాజ్పూర్లో ఢిల్లీ-లక్నో హైవేపై వేగంగా వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న టీస్టాల్పైకి దూసుకెళ్లింది.
దాంతో టీస్టాల్లోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. బస్సులో ఉన్న వారితో కలిపి మొత్తం ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల్లో అలీ అనే వ్యక్తి గర్భిణి అయిన తన భార్యను ఆస్పత్రిలో చేర్పించడానికి, వేద్పాల్ అనారోగ్యంతో ఉన్న బంధువును పరామర్శించటానికి వచ్చి ఆస్పత్రి పక్కనే ఉన్న టీస్టాల్లో టీ తాగుతూ ప్రమాదంలో మృతిచెందారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.