శ్రీనగర్: ఉగ్రవాద సంస్థలో చేరి ఆయుధాల్లో శిక్షణ పొందేందుకు సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) వెళ్తున్న ముగ్గురు పదో తరగతి విద్యార్థులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని ఒక రహస్య ప్రాంతంలో ఉన్న వీరిని గురువారం పట్టుకున్నారు.
16 ఏండ్ల వయసున్న ముగ్గురు బాలురు పదో తరగతి విద్యార్థులని పోలీసులు తెలిపారు. పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్న తయాబ్ ఫరోకీ అనే ఉగ్రవాద కమాండర్తో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు చెప్పారు. కుప్వారా మీదుగా నియంత్రణ రేఖను దాటి అతడ్ని కలిసేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ముగ్గురు బాలురను సుల్తాన్ ఖండే, ఫుర్కాన్ నజీర్ ఖండే, కమ్రాన్ సజాద్ షేక్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా కశ్మీర్ లోయలోని పుల్వామా జిల్లాకు చెందినవారని చెప్పారు. సోషల్ మీడియాలో ఫరోకీని అనుసరించి ఉగ్రవాదం వైపు మళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా దర్యాప్తులో తెలిపారన్నారు.
కాగా, చిన్న వయస్సు నేపథ్యంలో బాధ్యతాయుతమైన, శాంతిని పాటించే పౌరులుగా సంస్కరించడానికి వారికి అవకాశం కల్పించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో తల్లిదండ్రులకు వారిని అప్పగించనున్నారు. జమ్ముకశ్మీర్లో శాంతిభద్రతలను అస్థిరపరిచే పాకిస్థానీ ఎజెండాకు యువత బలైపోకుండా వారి కార్యకలాపాలను పర్యవేక్షించాలని యువత తల్లిదండ్రులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఉగ్రవాదుల ప్రచారాలకు ప్రభావితం కావద్దని, తప్పుదారి పట్టవద్దని యువతకు సూచించారు.