ఇంఫాల్: మణిపూర్లో (Manipur) వరుసగా హింసాత్మక ఘటనలు (Violence) చోటుచేసుకుంటున్నాయి. బుధవారం తెంగ్నోపాల్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించిన విషయం తెలిసిందే. అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి తోబాల్ (Thoubal) జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్పై దుండగులు దాడిచేశారు. దీంతో ముగ్గురు బీఎస్ఎఫ్ (BSF) జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి తోబాల్ జిల్లా ఖంగాబాక్ ప్రాంతంలోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్పై కాంప్లెక్స్పై సామూహికంగా దాడికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు.
అనంతరం తోబాల్ పోలీస్ హెడ్క్వార్టర్స్పై దాడికి తెబడ్డారని, సాయుధులైన కొందరులు కాల్పులు జరిపారని తెలిపారు. దీంతో ముగ్గురు బీఎస్ఎఫ్ సిబ్బందికి బుల్లెట్ల గాయాలయ్యాయని చెప్పారు. వారిని ఇంఫాల్లోని దవాఖానకు తరలించామని వెల్లడించారు. బుధవారం సాయంత్రం తెంగ్నోపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాల తాత్కాలిక పోస్ట్పై మిలిటెంట్లు దాడులు చేశారు. కుకీ మిలిటెంట్లుగా భావిస్తున్న వారు చేసిన ఈ దాడిలో ఇద్దరు పోలీస్ కమెండోలు మృతి చెందారు. దీంతో మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ తాత్కాలిక పోస్ట్పై మిలిటెంట్లు బాంబులతో దాడి చేసి కాల్పులు జరపడమే కాక ఆర్పీజీ షెల్స్ ప్రయోగించారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.