Gujarat Earthquake | గుజరాత్లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం
సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్
రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు వెల్లడించారు.
ఈ భూకంప కేంద్రం సూరత్కు నైరుతి దిశగా 27 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నట్టు
గుర్తించినట్లు తెలిపారు. 5.2 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. భూ
ప్రకంపనలతో సూరత్ సహా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి
బయటకు పరుగులు తీశారు. ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (జీఎస్డీఎమ్ఏ) ప్రకారం.. రాష్ట్రంలో 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001లలో భారీ భూకంపాలు సంభవించాయి. వీటిల్లో 2001లో కచ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ధాటికి 13,800 మంది మృత్యువాత పడగా.. 1.67 లక్షల మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భూకంపం ప్రపంచంలోనే అతిభారీ భూకంపాల్లో మూడోది కాగా, భారత్లో అత్యంత విధ్వంసం సృష్టించిన భూకంపాల్లో రెండోది.