Vote | న్యూఢిల్లీ : వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3.30 లక్షల మంది వికలాంగులు, 80 ఏండ్ల పైబడిన వారు ఇంటి నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 2.6 లక్షల మంది సీనియర్ సిటిజెన్లు(80 ఏండ్లు పైబడిన వారు), 70 వేల మంది వికలాంగులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఓటర్లంతా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేశారని తెలిపారు.
ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల్లో హోం ఓటింగ్ సదుపాయం కల్పించామన్నారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటు హక్కును వినియోగించుకున్న 2.5 లక్షల మంది సీనియర్ సిటిజెన్లకు ఎన్నికల కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలు రాసింది.