లాభాల బాటలో ప్రభుత్వరంగ సంస్థలు అయినా గొంతు పిసికేయాలని చూస్తున్న కేంద్రం గడిచిన ఎనిమిదేండ్లలో పీఎస్యూల్లోని వాటాల విక్రయంతో కేంద్రప్రభుత్వం రూ. 4.5 లక్షల కోట్లను అర్జించింది. దీనికోసం చట్టంలోని నిబంధనల్ని ఏకపక్షంగా మార్చేసింది.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): అందినకాడికి అమ్ముకొని సొమ్ముచేసుకోవాలన్న కేంద్ర సర్కారు దురాశకు ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్యూలు) బలిపశువులుగా మారుతున్నాయి. గడిచిన ఎనిమిదేండ్లలో పీఎస్యూల్లోని వాటాల విక్రయంతో కేంద్రప్రభుత్వం రూ. 4.5 లక్షల కోట్లను అర్జించింది. దీనికోసం చట్టంలోని నిబంధనల్ని ఏకపక్షంగా మార్చేసింది. ఏటికేడూ అంచనాలకు మించి లాభాలను గడిస్తున్న కంపెనీలు.. నష్టాల ఊబిలోకి కూరుకుపోయినట్టు కట్టుకథలు ప్రచారం చేసింది. కేంద్రప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పీఎస్యూలు చెల్లిస్తున్న డివిడెండ్లు నిగ్గుతేల్చిన నిజమిది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వేసిన ఓ పిటిషన్కు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఇచ్చిన వివరాలు ఇవి.
అంచనాలకు మించి డివిడెండ్లు..
కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో కొంతమొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్ల రూపంలో చెల్లిస్తాయి. గడిచిన 8 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సీపీఎస్యూల్లో) రూ. 4.5 లక్షల కోట్ల వాటాలను కేంద్ర సర్కారు విక్రయించినప్పటికీ, ఇంకా ఆయా సంస్థల్లో కేంద్రానికి మరికొన్ని వాటాలు మిగిలే ఉన్నాయి. దీంతో తాము గడించిన లాభాల్లో సీపీఎస్యూలు కేంద్రానికి ఏటా చెల్లింపులు చేస్తూ వస్తున్నాయి. అయితే, కేంద్రం బడ్జెట్ అంచనాలకు మించి సీపీఎస్యూలు డివిడెండ్లు చెల్లిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు.. 2020-21 ఆర్థిక సంవత్సరం సీపీఎస్యూల ద్వారా కేంద్రం అంచనా వేసిన డివిడెండ్ రూ. 34,717 కోట్లుగా ఉంటే, ఆయా సంస్థలు రూ. 39,750 కోట్లు (12.6 శాతం ఎక్కువ) డివిడెండ్గా చెల్లించాయి. ఆ మరుసటి ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో కేంద్రం డివిడెండ్ అంచనా రూ. 46 వేల కోట్లుగా ఉంటే, సీపీఎస్యూలు రూ. 59,101 కోట్లు (28 శాతం ఎక్కువ) డివిడెండ్గా చెల్లించాయి. ఈ ఏడాది గడిచిన ఆరు నెలల్లో రూ. 18,719 కోట్లను సీపీఎస్యూలు కేంద్రానికి డివిడెండ్లుగా చెల్లించాయి. ఈ మేరకు యూనియన్ బడ్జెట్ పత్రాలు-దీపమ్ వెల్లడించాయి. లాభాలు గడించనిది.. సీపీఎస్యూలు ఇంత పెద్దమొత్తంలో ప్రభుత్వానికి డివిడెండ్లు ఎలా చెల్లించగలవని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న కేంద్ర సర్కారు మాటలు అబద్ధాలని ధ్వజమెత్తుతున్నారు.
గొంతు పిసికేయాలని..
ఏ కంపెనీ అయిన తమ శాఖలను విస్తరించడానికి.. వచ్చిన లాభాలను పెట్టుబడుల రూపంలో మళ్లిస్తాయి. అయితే, సీపీఎస్యూల విస్తరణను వ్యతిరేకిస్తున్న కేంద్రం వాటిని పైవేటీకరించడానికే పట్టుబడుతున్నది. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కేంద్రం వాటా ఉన్న ఏ సీపీఎస్యూ అయినా.. వచ్చిన లాభాల్లో 30 శాతాన్ని (పన్నులు కాకుండా) లేదా నికర విలువలో 5 శాతాన్ని.. ఈ రెండింట్లో ఏది ఎక్కువ అయితే దాన్ని, కేంద్రానికి డివిడెండ్ల రూపంలో చెల్లించాలని నిబంధన తీసుకొచ్చింది. దీంతో ఏటికేడు లాభాలు గడిస్తున్నా, కేంద్రం కొర్రీలతో సీపీఎస్యూలు విస్తరణకు నోచుకోవడంలేదు. నిబంధనలకు లోబడి గత ఎనిమిదేండ్లలో సీపీఎస్యూలు రూ.3,25,132 కోట్లు కేంద్రానికి చెల్లించాయి.