బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. సోమవారం కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర రాజధాని, ఐటీ హబ్ అయిన బెంగళూరులోనే ఈ ఒమిక్రాన్ కేసులన్నీ నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. దీంతో కర్ణాటకలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 766కు చేరిందని చెప్పారు.
మరోవైపు కరోనాతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుతున్న నేపథ్యంలో బెంగళూరులో మరిన్ని ఆంక్షలు విధించారు. జనవరి 31వ తేదీ ఉదయం 5 గంటల వరకు బెంగళూరు నగరంలో అన్ని రకాల ర్యాలీలు, నిరసనలను నిషేధించారు. వేడుకలకు సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, మూసి ఉన్న ప్రదేశాల్లో 100 మందికి మించి జనం పాల్గొనకూడదని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు.