తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. తాజాగా ఒక సెంట్రల్ జైలులోని 262 మంది ఖైదీలకు కరోనా సోకింది. తిరువనంతపురంలోని పూజప్పురా కేంద్ర కారాగారంలో ఈ ఘటన జరిగింది. అందులోని 936 మంది ఖైదీలకు గత మూడు రోజులుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 262 మంది ఖైదీలకు పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. దీంతో కరోనా సోకిన ఖైదీలను వేరుగా జైలు వార్డుల్లో ఉంచినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. కరోనా బారినపడిన ఖైదీల సంరక్షణకు ప్రత్యేక వైద్యులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
మరోవైపు కన్నూర్లోని సెంట్రల్ జైలులో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్గా తేలిన వారు కోజికోడ్, కాసర్గోడ్కు చెందిన రిమాండ్ ఖైదీలని జైలు అధికారులు తెలిపారు. ఈ ఖైదీలను ప్రత్యేక సెల్ బ్లాక్లో ఉంచినట్లు చెప్పారు. జైలులో ఉన్న ఇతర ఖైదీలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, కేరళలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 41,668 కేసులు నమోదయ్యాయి. 7,896 పాజిటివ్ కేసులతో తిరువనంతపురం టాప్లో నిలిచింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఆంక్షలు విధించింది.