ఇటీవల ఇటుక బట్టీ కార్మికుడికి ఓ డైమండ్ దొరికిన విషయం తెలిసిందే కదా. మధ్యప్రదేశ్లోని డైమండ్ సిటీ పన్నాలో ఓ కార్మికుడికి 26.11 క్యారెట్ డైమండ్ దొరికింది. దాన్ని తాజాగా వేలంలో వేయగా ఏకంగా 1.62 కోట్ల రూపాయలు పలికింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఈ వేలాన్ని డైమండ్ సిటీ పన్నాలోనే నిర్వహించారు. పన్నా.. డైమండ్స్కు పెట్టింది పేరు. ప్రభుత్వమే అక్కడ డైమండ్స్ వెతికేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఎవరికి డైమండ్ దొరికినా.. దాన్ని వేలం వేస్తారు. దాని మీద వచ్చిన డబ్బును డైమండ్ తెచ్చి ఇచ్చిన వాళ్లను అందజేస్తారు.
ఆ వేలంలో ఆ డైమండ్తో పాటు మరో 87 ఇతర డైమండ్స్ను కూడా వేలంలో ఉంచగా.. వాటికి మొత్తం 1.89 కోట్లు పలికింది. అవి మొత్తం 82.45 క్యారెట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 21న కార్మికుడికి ఆ డైమండ్ దొరికింది. చాలా ఏళ్ల తర్వాత అంత విలువైన వజ్రం దొరికిందని.. అది 1.62 కోట్లకు అమ్ముడుపోవడం ఒక రికార్డు అంటూ వేలం నిర్వాహకులు తెలిపారు.
ఆ డైమండ్ను లోకల్ ట్రేడర్ భారీ మొత్తం వెచ్చించి చేజిక్కించుకున్నాడు. కృష్ణ కళ్యాణ్పూర్ ప్రాంతంలో ఇటుకల బట్టీలో పనిచేసే కార్మికుడు సుశీల్ సుక్లాకే ఆ డైమండ్ దొరికింది. దాని మీద వచ్చిన డబ్బులో ప్రభుత్వం రాయల్టీ, ట్యాక్సులు పోను.. మిగితా డబ్బును సుశీల్కు వేలం నిర్వాహకులు అందజేశారు. అధికారుల లెక్కల ప్రకారం.. పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల విలువైన వజ్రాల గని ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వమే అక్కడి స్థానికులతో మైనింగ్ చేయించి వజ్రాలను కలెక్ట్ చేస్తోంది.