(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కొంత సమయం నడవాలని(వాకింగ్) డాక్టర్లు తరుచూ సూచించే విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజా అధ్యయనంలో నడక కంటే రోజూ 25 నిమిషాల పాటు పరుగెడితే ఆయుష్షు పెంచుకోవచ్చని, 8 ఏండ్ల పాటు 35 శాతం మృత్యు గండం నుంచి తప్పించుకోవచ్చని తేలింది. తైవాన్లో 4 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో రన్నింగ్ వల్ల ఆయుష్షు పెరుగుతున్నట్లు గ్రహించారు. రోజూ జాగింగ్ కాని, రన్నింగ్ కాని, వేగంగా నడవడం వల్ల కలిగే లాభాలను బేరీజు వేశారు.
ఆ పరిశోధనల్లో రోజూ 25 నిమిషాలు రన్నింగ్ చేయడం లేదా 105 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ఎనిమిదేండ్ల పాటు 35 శాతం వరకు మృత్యువు నుంచి తప్పించుకోవచ్చని తేలింది. 2014లో అయోవా స్టేట్ యూనివర్సిటీ ప్రొ.డక్ చుల్ లీ నాయకత్వంలో జరిగిన అధ్యయనంలో రోజూ క్రమం తప్పకుండా నిర్ధారిత సమయం ప్రకారం సుమారు 9 కిలోమీటర్ల వేగంతో జాగింగ్ చేయడం వల్ల వాకింగ్ చేయడం కంటే 30 శాతం మెరుగైన ఫలితాలు కనిపించాయి. రన్నింగ్ వల్ల పదిహేనేండ్ల వరకు 30 శాతం మేర మరణాలను జయించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. రన్నింగ్ చేయడం వల్ల గుండెకు ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ అందడం ద్వారా ఆయుష్షు పెరిగే అవకాశాలు మెరుగుపడతాయని అధ్యయనంలో తేలింది.