గౌహతి: పేదరికంతో బాధపడుతున్న ఒక వ్యక్తి 25 రోజుల పసిబిడ్డను రూ.30,000కు అమ్మాడు. (Infant Sold By Father) ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) వెంటనే స్పందించింది. ఒక డాక్టర్ ఇంటి నుంచి ఆ శిశువును అధికారులు రక్షించారు. అస్సాంలోని ధేమాజీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 4న దిబ్రూగఢ్లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఒక మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తల్లిదండ్రులైన ధిమాన్ బోరా, సబితా బోరా ఆడ పిల్లను భారంగా భావించారు. శిశువును ఆ హాస్పిటల్లో వదిలి అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, చైల్డ్ హెల్ప్లైన్కు ఈ సమాచారం తెలిసింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) దీనిపై స్పందించింది. శిశువు పేరెంట్స్ను గుర్తించి తమ వద్దకు రావాలని ఆదేశించింది. భయపడిన తల్లిదండ్రులు మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుంచి ఆ శిశువును తిరిగి పొందారు. అయితే పెగు సోహోరియా, ఆమె భర్తకు ఆ పసికందును రూ.30,000కు అమ్మేశారు.
మరోవైపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఈ విషయం తెలిసింది. దీంతో సిలాపత్తర్లోని డాక్టర్ చంద్రజిత్ డోలే ఇంట్లో ఉన్న ఆ శిశువును రక్షించి స్వాధీనం చేసుకున్నారు. శిశువు విక్రయంలో బుబుల్ బోరా, దిలీప్ సైకియా కీలక పాత్ర ఉందని అధికారులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.