దాహమేస్తే లీటర్ వాటర్ బాటిల్ కొని గటగటా తాగేస్తాం. మినరల్ అన్నదే చూస్తాం కానీ, అది ‘ప్యాకేజ్డ్ గరళం’ అని గుర్తించం. ఒక్కో లీటర్ వాటర్ బాటిల్లో 2.4లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని కొలంబియా పరిశోధకులు తాజాగా తేల్చి.. అందరి గొంతు తడారిపోయేలా చేశారు.
హైదరాబాద్, జనవరి 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు దుకాణాల్లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసి అందరూ నీళ్లు తాగడం తెలిసిందే. అయితే, అలాంటి లీటర్ బాటిల్ నీటిలో 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు.
ఒక మైక్రో మీటర్ పొడవు, వెంట్రుకలో 17వ వంతు వెడల్పు ఉండే ఈ రేణువులను నానోప్లాస్టిక్ కణాలుగా వ్యవహరిస్తారని అన్నారు. ఇలాంటి నీటిని తాగడం వల్ల కణాల్లోకి నానోప్లాస్టిక్ రేణువులు చేరి జీవక్రియలకు అంతరాయం ఏర్పడవచ్చని, రక్తనాళికల్లో చేరడంతో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి గుండెపోటు సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు. రక్తంలో ప్లాస్టిక్ చేరడంతో గర్బిణిల్లో పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్య సమస్యలు, ఎదుగుదల లోపాలు ఎదుర్కొనే ప్రమాదమున్నదని వెల్లడించారు. ఈ వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.