పాట్నా : బీహార్లోని గోపాల్గంజ్, వెస్ట్ చంపారన్ జిల్లాల్లో విషాదం నెలకొంది. నకిలీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో 8 మంది చనిపోయారు. గోపాల్గంజ్ జిల్లాలో 16 మంది మృతి చెందారు. అయితే వీరంతా నకిలీ మద్యం సేవించిన తర్వాతే చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామని, ఆ తర్వాతే వారి మరణాలకు గల కచ్చితమైన కారణం తెలిసే అవకాశం ఉందని గోపాల్గంజ్ పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో దాదాపు 20 మంది ఎస్టీలే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా తయారు చేసిన మద్యం సేవించిన తర్వాతే వీరు చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
బీహార్ మంత్రి జనక్ రామ్ గోపాల్గంజ్ జిల్లా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. నకిలీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించినట్లు మంత్రి తెలిపారు. సీఎం నితీష్ కుమార్ బీహార్లో మద్యపాన నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం సేవించి ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు 70 మంది ప్రాణాలు కోల్పోయారు.