నేరేడుగొమ్ము(చందంపేట), ఏప్రిల్ 19 : నేరేడుగొమ్ము మండలంలోని బుగ్గతండాలో ఆదివారం అర్ధరాత్రి దంపతులు హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చాయి. సొంత తమ్ముడి కొడుకులే పెదనాన్న, పెద్దమ్మలను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపారు. హత్యకు గురైన దంపతులు వాంకునావత్ సోమాని(45), వాంకునావత్ బుల్లి(40)కాగా హత్యకు గురైన సోమాని సొంత తమ్ముడు వాంకునావత్ లచ్య కుమారులు సురేశ్, నరేశ్, గణేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గతండాకు చెందిన వాంకునావత్ సోమాని, లచ్య స్వయానా అన్నదమ్ములు. 10 ఏండ్ల నుంచి వీరి మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 8 ఏండ్ల క్రితం వాంకునావత్ లచ్య మృతి చెందాడు. అయినప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు కొనసాగుతూనే ఉన్నాయి. వారం క్రితం నిందితుడు సురేశ్ ఇంటి సమీపంలో మృతుడు సోమాని కాలకృత్యాలు తీర్చుకునే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. దీన్ని మనుసులో పెట్టుకున్న సురేశ్.. వేరే ప్రాం తాల్లో ఉంటున్న తన సోదరులు నరేశ్, గణేశ్ను పిలిపించుకొని ఆదివారం రాత్రి హత్యకు ప్రణాళిక రూపొందించుకున్నారు.
ఆరు బయట నిద్రిస్తుండగా..
సోమాని, బుల్లి దంపతులు ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ముగ్గురు అన్నదమ్ములు గొడ్డలితో అతి దారుణంగా నరికి హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సోమాని పెద్ద కొడుకు కోడలు మంజ్యా, జ్యోతి కేకలు వేయడంతో పరారయ్యారు. కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చే సరికే మృతులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. తండావాసులు నేరేడుగొమ్ము పోలీసులకు సమాచారం అందించడంతో సోమవారం తెల్లవారుజామున 2 గం టలకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే నిందితు లు ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో సహా పరారయ్యారు. హత్యకు గురైన దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుల కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా నిందితులు నల్లగొండలోని ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయినట్లు సమాచారం.