న్యూఢిల్లీ: దేశంలోని 23 మంది ఎంపీల ఆస్తుల(MPs Assets) సగటు విలువ గడిచిన 15 ఏండ్లలో భారీగా రెట్టింపు అయ్యింది. రాహుల్ గాంధీ, సోనియా గాందీ, మేనకా గాంధీ ఆస్తులు సగటున వెయ్యి శాతం పైనే వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. 2004 నుంచి ఆ ఎంపీలు లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ ఎంపీల ఆస్తులు సగటున 35.18 కోట్ల నుంచి సుమారు 402 కోట్ల వరకు గడిచిన 15 ఏండ్లలో పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఈ రిపోర్టును రిలీజ్ చేసింది.
కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ జిగజింగానీ ఆస్తులు అత్యధికంగా వృద్ధి సాధించాయి. ఆయన ఆస్తుల విలువ సగటున 9098 శాతం పెరిగింది. 2004లో 54.8 లక్షలు ఉన్న ఆయన ఆస్తులు.. 2019 నాటికి 50.41 కోట్ల వరకు పెరిగినట్లు అంచనా వేశారు. ఆ రాష్ట్రానికి చెందిన మరో అయిదుగురు ఎంపీలు తమ ఆస్తుల్ని వృద్ధి చేసిన వారిలో ఉన్నారు. జీఎం సిద్దేశ్వర్(ధవనగరి) ఆస్తులు 5.02 కోట్ల నుంచి 38.01 కోట్లుకు పెరిగింది. అంటే ఆస్తుల విలువ సుమారు 656 శాతం వృద్ధి చెందింది. డీవీ సదానంద గౌడ ఆస్తులు 46.39 లక్షల నుంచి 20.93 కోట్లకు చేరుకున్నది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆస్తులు 77 లక్షల నుంచి 11 కోట్లకు పెరిగాయి. అంటే 1335 శాతం వృద్ధి సాధించారు. అనంతకుమార్ హెగ్డే ఆస్తులు 12 లక్షల నుంచి 8.4 కోట్లకు చేరుకున్నది. అంటే ఆస్తుల విలువ 6928 శాతం పెరిగింది. పీసీ గడ్డిగోదార్ ఆస్తులు 53 లక్షల నుంచి 4.39 కోట్లకు చేరుకున్నాయి.
2004 నుంచి ఎన్నికైన 23 మంది ఎంపీల్లో .. బీజేపీ వాళ్లు 17 మంది ఉన్నారు. కాంగ్రెస్లో ముగ్గురు, ఒక్కొక్క ఎంఐఎం, శివసేన, బీజేపీ ఎంపీ ఉన్నారు. 2004లో సగటున 1.52 కోట్లు ఉన్న ఆ ఎంపీల ఆస్తులు.. 2019 నాటికి 17.51 కోట్లకు చేరుకున్నది. సగటును ఈ ఎంపీల్లో 15 కోట్లు ఆస్తులు పెరిగాయి. ఈ వృద్ధి 1045 శాతంగా ఉన్నట్లు ఏడీఆర్ అంచనా వేసింది.
రాహుల్ గాంధీ ఆస్తులు 2004లో 55.38 లక్షలు కాగా, 2019 నాటికి ఆయన ఆస్తుల విలువ 15.88 కోట్లకు చేరుకున్నది. అంటే ఆయన ఆస్తులు గత 15 ఏండ్లలో 2769 శాతం వృద్ధి సాధించాయి. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ సగటు ఆస్తుల విలువ 1280 శాతం పెరిగింది. ఆమె ఆస్తుల విలువ 85.68 లక్షల నుంచి 11.82 కోట్లకు చేరుకున్నది. అధిర్ రంజన్ చౌదరి ఆస్తుల విలువ 1.93 కోట్ల నుంచి 10.13 కోట్లకు చేరుకున్నది.