ChatGPT | కృత్రిమ మేధతో టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓపెన్ ఏఐ స్టార్టప్ తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్జీపీటీ విజయం సాధించడంతో అందరి దృష్టి దానిపైకి మళ్లింది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థలన్నీ చాట్జీపీటీ తరహాలో చాట్బోట్లు తయారు చేస్తున్నాయి. చాట్జీపీటీతో కంటెంట్ రైటింగ్తోపాటు పలు పనులు తేలిగ్గా సాగిపోతున్నాయి. చాట్బోట్ల వల్ల టెక్నాలజీ పురోగతి సాధించినా.. దాంతో నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోల్కతాకు చెందిన శరణ్య భట్టాచార్య అనే (22) విద్యార్థిని ఓ సంస్థకు కాపీ రైటర్గా ఫ్రీలాన్సింగ్ విధులు నిర్వహిస్తున్నారు.
కానీ, కృత్రిమ మేధ రాకతో తన ఆదాయం 90 శాతం పడిపోయిందని సోషల్ మీడియా వేదికగా శరణ్య భట్టాచార్య ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతి నెలా కొన్ని కథనాలు రాయడంతో రూ.20 వేల ఆదాయం సంపాదించే శరణ్య.. చాట్జీపీటీ వచ్చిన తర్వాత ఆ రాబడి తగ్గిపోయింది. కాపీ రైటర్గా ఫ్రీలాన్సింగ్ చేస్తూ విద్యాభ్యాసం చేస్తున్న శరణ్యకు ఇప్ప్పుడు ఒకటి లేదా రెండు కథనాలు మాత్రమే రాసే అవకాశం కల్పిస్తున్నది సదరు క్రియేటివ్ సంస్థ. ఇప్పటి వరకు తాను చేసిన పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బోట్తో చేయించుకుంటున్నారన్నారు.
తాను చదువుకోవడంతోపాటు ఇంటి దగ్గర ఉన్న తన 45 ఏండ్ల తల్లికి చేదోడువాదోడుగా నిలిచేదాన్నని, కానీ, నెలవారీ ఆదాయం తగ్గడంతో తమ కుటుంబ జీవనంపైనా ప్రభావం పడిందని శరణ్య భట్టాచార్య ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా రోజువారీ ఖర్చుల కోసం లెక్కలేసుకోవాల్సి వస్తుందని వాపోయారు. యంత్రాలూ మనుషులు చేసే పనుల్లో తేడా ఉంటుందన్నారు. ఉద్యోగుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని సంస్థల యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.