Coronavirus | న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు ఆ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 21వ తేదీ వరకు కొత్తగా 22 జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత కొద్ది వారాల నుంచి ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలకు పైగా చేరింది. గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఈ మరణం కేరళలో నమోదైంది. దీంతో కరోనా కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,33,328కి చేరింది.
ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
మొత్తం 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో యాక్టివ్ కేసులు పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్తో పాటు పుదుచ్చేరిలో యాక్టివ్ కేసులు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.