ఇండోర్: వారంతా ఏ దిక్కూ లేని పిల్లలు. మధ్యప్రదేశ్లో ఇండోర్లోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్నారు. అలాంటి వారిని తల్లిదండ్రులు లేని లోటు కనిపించకుండా చూసుకోవాల్సిన ఆశ్రమ సిబ్బందే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చిన్న తప్పులకే చిత్రహింసలు పెడుతూ దారుణంగా వ్యవహరిస్తున్నారని బాధిత చిన్నారులు వాపోతున్నారు. బట్టలు ఊడదీయడం, నగ్నంగా ఫొటోలు తీయడం, తలకిందులుగా వేలాడదీయడం, వాతలు పెట్టడం, మిర్చిని కాల్చడం ద్వారా వచ్చే పొగను బలవంతంగా పీల్చేలా చేయడం వంటివి చేస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆశ్రమ సిబ్బంది పలు విధాలుగా హింస పెడుతున్నారని గత వారం ఆకస్మిక తనిఖీలకు వచ్చిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు 21 మంది చిన్నారులు వాపోయారని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ భయానక హింసకు సంబంధించి ఐదుగురు ఆశ్రమ సిబ్బందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ప్యాంటులో మలవిసర్జన చేశాడన్న కారణంతో ఒక నాలుగేండ్లు విద్యార్థిని బాత్రూమ్లో నిర్బంధించి, 2-3 రోజుల పాటు ఆహారం కూడా పెట్టలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆశ్రమాన్ని సీల్ చేశామని, పిల్లలను ప్రభుత్వ కేంద్రాలకు తరలించామని ఇండోర్ ఏసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు. వాత్సల్యపురం జైన్ ట్రస్టు నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నమోదు కాలేదని, ఈ ట్రస్టుకు బెంగళూరు, సూరత్, జోధ్పూర్, కోల్కతాలో కూడా ఆశ్రమాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఇండోర్ ఆశ్రమంలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెం దిన చిన్నారులు ఉన్నట్టు తెలుస్తున్నది.