న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 అక్టోబరు 1 నుంచి ట్రక్కు తయారీ కంపెనీలన్నీ దీనిని విధిగా పాటించాలని, డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్ను సిద్ధం చేయాలంటూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్2, ఎన్3 క్యాటగిరీ వాహనాల డ్రైవర్ క్యాబిన్ తప్పనిసరిగా ఎయిర్ కండిషన్డ్ అయి ఉండాలని స్పష్టం చేసింది.
ట్రక్లో ఏసీ క్యాబిన్ను తప్పనిసరి చేస్తూ జారీచేసిన ముసాయిదా నోటిఫికేషన్కు ఆమోదం లభించినట్టు ఈ ఏడాది జూలైలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలోని రవాణా రంగంలో కీలకపాత్ర పోషించే ట్రక్ డ్రైవర్ల సమస్యల్ని పరిష్కరించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఆయన.. వారికి మెరుగైన పని వాతావరణం కల్పించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచవచ్చని పేర్కొన్నారు. త్వరలోనే ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్ను తప్పనసరి చేయబోతున్నట్టు అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఈ విషయంలో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.