వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇందుకు గాను ఎన్నికల సాధికారత కమిటీని నియమించింది. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రూట్ మ్యాప్పై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్లు అధినేత్రి సోనియా ఇంట్లో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సాధికారత కమిటీని అధినేత్రి ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. అయితే… వ్యూహకర్త పీకేకి పార్టీలో ఎలాంటి బాధ్యతలిస్తారు? అని ప్రశ్నించగా… ఆ ప్రశ్నను దాటవేశారు.
ఇక.. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఓ నవసంకల్ప్ చింతన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సూర్జేవాలా వెల్లడించారు. మే 13 నుంచి 15 వరకూ ఈ శిబిరం జరుగుతుంది. దీనికి 400 మంది ప్రతినిధులు వస్తారని ఆయన వెల్లడించారు.
పీకే రిపోర్టుపై సోనియాకు నివేదిక ఇచ్చారు….
పీకే ప్రతిపాదించిన ప్రతిపాదనలను చిదంబరం కమిటీ అధ్యయనం చేసిందని, ఈ నివేదికను సోనియాకు సమర్పించారని సూర్జేవాలా ప్రకటించారు. ఈ రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. దీని ఆధారంగా సాధికారత యాక్షన్ గ్రూప్-2024 గ్రూపును ఏర్పాటు చేశారని సూర్జేవాల వెల్లడించారు.