శ్రీనగర్ : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ సాధించే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తేల్చిచెప్పారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని తాను అనుకోవడం లేదని ఆజాద్ స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 300 సీట్లు సాధించాలని తాను కోరుకుంటున్నా అది జరుగుతుందని తాను భావించడం లేదని కుండబద్దలు కొట్టారు.
జమ్ము కశ్మీర్లోని సరిహద్దు జిల్లా పూంచ్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ ఈ అంశంపై తాను పార్లమెంట్లో పలు సందర్భాల్లో మాట్లాడానని అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ మాట్లాడలేనని అన్నారు.
మన భూభాగం, ఉద్యోగాలను కాపాడుకోవడం ప్రస్తుతం కీలకాంశమని తనకు ముఖ్యమంత్రి పదవి అనేది ఇప్పుడు అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 వ్యవహారం సుప్రీంకోర్ఠు పరిధిలో ఉందని, తీర్పు ఎప్పుడు వస్తుందనేది ఎవరికీ తెలియదని అన్నారు.