న్యూఢిల్లీ: డాక్టర్లకు భారీ ఊరట కల్పించింది సుప్రీంకోర్టు. 2021-2022 వార్షిక సంవత్సరానికి సంబంధించిన నీటి పీజీ అడ్మిషన్లకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పేసింది. నీట్ పీజీ వైద్య విద్యార్ధులకు కోటాను ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్కు కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో నీట్ పీజీ కౌన్సిలింగ్పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. నీట్ పీజీ కోటాపై త్వరలో నిర్ణయం తీసుకోవాలన్ని కొన్నాళ్ల నుంచి దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందేవారికి 8 లక్షల వార్షిక ఆదాయం ఉండాలన్న నిబంధన కూడా ఈ ఏడాది వర్తించనున్నది. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై మార్చిలో పూర్తి స్థాయిలో విచారణ జరగనున్నది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొపన్నలతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించింది. ఆయా రాష్ట్రాల మెడికల్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటా సీట్లకు పాత రిజర్వేషన్లే వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ కౌన్సిలింగ్ విషయంలో పాండే కమిటీ నివేదికను అంగీకరిస్తున్నామని, నీట్ పీజీ, యూజీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్కు లోబడే జరుగుతుందని, పాండే కమిటీ నివేదికను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు కోర్టు తెలిపింది.