Umar Khalid : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్కు కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించింది. తన తల్లిని సంరక్షించుకునేందుకు, అలాగే, మరో కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఉమర్ ఖలీద్ ఇటీవల ఢిల్లీలోని కార్కర్డూమా కోర్టును ఆశ్రయించాడు. దీనిపై అదనపు జడ్జి సమీర్ బాజ్పాయ్ విచారణ జరిపారు. ఉమర్ ఖలీద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
బెయిల్ తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఉమర్ ఖలీద్ తల్లికి జూన్ 2న శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంది. దీంతో ఆమెకు కొద్ది రోజులు తోడుగా ఉండాలని ఉమర్ ఖలీద్ కోర్టును కోరాడు. అలాతే, తమ బంధువు మరణించినందున దానికి సంబంధించిన కార్యక్రమానికి కూడా మతపరంగా హాజరుకావాల్సి ఉందని కోర్టుకు తెలిపాడు. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దరఖాస్తులో కోరాడు. కానీ, కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఉమర్ ఖలీద్కు గతంలో ఇలాంటి కార్యక్రమానికి హాజరయ్యేందుకు కోర్టు బెయిల్ ఇచ్చిందని, అలాగే, అతడు కూడా బెయిల్ నిబంధనల్ని పాటించాడని కోర్టు తెలిపింది.
అంతమాత్రాన ప్రతి సందర్భంలో బెయిల్ ఇవ్వలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి బెయిల్ దరఖాస్తును ప్రత్యేకంగా చూస్తామని, వాస్తవాల్ని, అవసరాల్ని పరిశీలిస్తామని చెప్పింది. ఉమర్ తల్లిని చూసుకునేందుకు అతడి సోదరి, తండ్రి అందుబాటులో ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఉమర్ ఖలీద్ కేసుకు సంబంధించి గతంలోనే సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ అంశంపై సోమవారం కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా అతడికి బెయిల్ నిరాకరించేందుకు అనేక కారణాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. బెయిల్ అనేది ఒక రూల్ అని, జైలు అందుకు మినహాయింపు అని కోర్టు తెలిపింది.
2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్టీయూ విద్యార్థి అయిన ఉమర్ ఖలీద్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అప్పట్లో సీఏఏ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో అతడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై యూఏపీఏ సహా వివిధ చట్టాలపై కేసులు నమోదయ్యాయి. అతడు 2020 నుంచి జైలులోనే ఉన్నాడు.