ముంబై: కుమార్తెతోపాటు మనుమరాలిపై లైంగికదాడికి పాల్పడిన 65 ఏండ్ల వ్యక్తికి మహారాష్ట్రలోని పోక్సో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. తండ్రి తనపై 15 ఏండ్ల వయసు నుంచి లైంగికదాడికి పాల్పడిన్నట్లు బాధితురాలైన కుమార్తె కోర్టుకు తెలిపింది. 2017లో మనుమరాలైన తన కుమార్తెపైనా తన తండ్రి లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె చెప్పిందని, దీంతో తండ్రికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు కేసులో నమోదైన ఐపీసీ సెక్షన్ 376(2)(అత్యాచారం), పోక్సో చట్టం కింద వాదనలు, ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి రేఖ ఎన్ పంధారే, ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతోపాటు కుమార్తెకు 50 వేలు, మనుమరాలికి 25 వేలు పరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు.