న్యూఢిల్లీ: ఇప్పటికే అన్ని రకాల వస్తువులు, సేవల చార్జీలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సెంచరీకి చేరువలో ఉన్నాయి. ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతో విమానయాన సంస్థలను ఆదుకునేందుకు దేశీయ విమానయాన సర్వీసుల్లో దిగువ శ్రేణి ప్రయాణ చార్జీలు ఐదు శాతం పెంచాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి విమాన టికెట్ల ధరలు ఐదు శాతం పెరుగుతాయి. దీని ప్రకారం కనీస విమాన ప్రయాణ టికెట్ ధర రూ.7,500గా ఖరారు చేశారు.
నిరంతరం ఏటీఎఫ్ ధరలు పెరిగిపోతుండటంతో దేశీయంగా వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణానికి విమాన టికెట్ల ధరలను కేంద్రం పెంచడం ఇది రెండోసారి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నిరంతరం ఏటీఎఫ్ ధరలు పెరిగిపోవడంతో దేశీయ విమానయాన సర్వీసుల్లో దిగువ శ్రేణి ప్రయాణ టికెట్ల ధరలు ఐదు శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించిందని ట్వీట్ చేశారు. ఎగువ శ్రేణి ప్రయాణ టికెట్ల ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు. పూర్తిస్థాయిలో విమాన సర్వీసులను అనుమతినిస్తే నెలలో మూడు సార్లు రోజువారీ ప్రయాణికుల ట్రాఫిక్ 3.5 లక్షలు దాటుతుందని ట్వీట్ చేశారు.
గతేడాది మే 21న ఏవియేషన్ రెగ్యులేటర్.. దేశీయంగా దిగువ-ఎగువ ప్రయాణ టికెట్ల శ్రేణిని ఖరారు చేసింది. 40 నిమిషాల్లోపు ప్రయాణానికి రూ.2000-6000, 40-60 నిమిషాల నిడివి గల ప్రయాణ టికెట్లు రూ.2,500-7500, 60-90 నిమిషాల నిడివి గల టికెట్ల ధరలు రూ.3,000-9,000, 90-120 నిమిషాల వ్యవధి గల ప్రయాణ టికెట్ల ధరలు రూ.3,500-10,000, 150 నిమిషాల గడువు గల విమాన ప్రయాణానికి రూ.4,500-13,000, మూడు గంటల ప్రయాణానికి టికెట్ల ధరలు రూ.5,500-15,700, 210 నిమిషాల నిడివి గల ప్రయాణ టికెట్ల ధరలు రూ.6,500-18,600గా నిర్ణయించారు.
ఇంతకుముందు పెంచిన ధరల ప్రకారం 210 నిమిషాల నిడివి గల విమాన ప్రయాణ టికెట్ ధర రూ.18,600 నుంచి 30 శాతం పెంచడంతో రూ.24,200లకు చేరుకున్నది. అంటే రూ.5,600 పెరిగింది. ఇంతకుముందు పెంచిన కనీస విమాన టికెట్ ధర రూ.6,500 నుంచి రూ.7,150కి చేరితే, తాజాగా రూ.7,500 నుంచి ప్రారంభం కానున్నది.