న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ నిరసనకారులు ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న టోల్ ప్లాజాలను కబ్జా చేసేశారు. దీంతో అక్కడ టోల్ వసూళ్లు తగ్గిపోయాయి. గత 8 నెలల నుంచి రెండు రాష్ట్రాల్లోని టోల్ ప్లాజాలు పనిచేయడం లేదు. దీని వల్ల సుమారు రెండు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ నుంచి చండీఘడ్కు జాతీయ రహదారి 44పై వెళ్లాలంటే.. కనీసం రూ.300 టోల్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ 8 నెలల నుంచి ఆ టోల్ను వసూల్ చేయడం లేదు. ఫ్రీ పాస్ ఇవ్వడం వల్ల ఆ ఆదాయం పడిపోయింది.
టోల్ ప్లాజాల వద్దే భారీ టెంట్లు వేసుకున్న రైతులు.. తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న సుమారు 50 టోల్ ప్లాజాలు ఆదాయం లేక బిక్కుబిక్కుమంటున్నాయి. రైతుల ఆందోళన వల్ల కేంద్ర ప్రభుత్వానికి, హైవే శాఖకు సుమారు రెండు వేల కోట్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతి రోజు 5 కోట్ల మేర నష్టం జరుగుతోందని ఓ అధికారి చెప్పారు. మార్చిలో పార్లమెంట్లో మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. టోల్ ప్లాజాలు మూసివేయడం వల్ల పంజాబ్లో 487 కోట్లు, హర్యానాలో 326 కోట్లు నష్టం వచ్చిందన్నారు.