లక్నో, సెప్టెంబర్ 5: ‘దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యూపీ త్వరలోనే అవతరించనున్నది. ధనిక రాష్ట్రంగా మారనున్నది’ అని గత జూన్లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, అలాంటి రిచ్ స్టేట్లో 4-6 నెలలుగా జీతాలు లేక జల్ నిగమ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20 వేల మందికి పైగా ఉద్యోగులు చెల్లింపులు లేక అవస్థలు పడుతున్నారు. ఇదీ డబుల్ ఇంజిన్ సర్కారు యూపీలో ప్రస్తుత పరిస్థితి..
బ్లాక్ డేగా పాటిస్తాం
గడిచిన నాలుగు నెలలుగా తమకు వేతనాలు అందట్లేదని ఉత్తరప్రదేశ్ జల్ నిగమ్ (వాటర్ కార్పొరేషన్)కు చెందిన వేలాదిమంది ఉద్యోగులు వాపోతున్నారు. పింఛన్ డబ్బులను కూడా విడుదల చేయట్లేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల విడుదలలో సర్కారు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు.
బకాయిలను చెల్లించకపోతే మరోసారి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. జీతాల చెల్లింపులు నిలిపివేయడంతో గత మార్చిలో జల్ నిగమ్కు చెందిన వందలాది మంది ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. దీంతో జనవరి వరకు ఉన్న బకాయిలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వేతనాల విడుదలను పెండింగ్లోనే ఉంచింది. దీంతో ప్రస్తుత, రిటైర్డ్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. వేతనాలు, పింఛన్లు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే సెప్టెంబర్ 9న (యూపీ జల్ నిగమ్ విభాగం ఏర్పడిన రోజు) రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతామని హెచ్చరించారు. ఆ రోజున నల్లటి రిబ్బన్లు ధరించి ‘బ్లాక్ డే’గా పాటిస్తామని జల్ నిగమ్ ఎంప్లాయీస్ కో-ఆర్డినేషన్ కమిటీ పేర్కొంది.
ఫ్రెండ్స్ దగ్గర అప్పులు
గడిచిన నాలుగు నెలలుగా నాకు వేతనం రావట్లేదు. నాపై ఆధారపడి ఐదుగురు కుటుంబసభ్యులు ఉన్నారు. నెలకు రూ. 20 వేల చొప్పున రెండు బ్యాంకు లోన్లు కట్టాల్సి ఉన్నది. పిల్లల స్కూల్ ఫీజు, ఇంట్లో అవసరాల కోసం బంధువులు, స్నేహితుల దగ్గర అప్పు చేయాల్సి వస్తున్నది.
– సంజీవ్ పాండే, జల్ నిగమ్ ఉద్యోగి-బాందా జిల్లా
20 వేల మందికి వేతనాల్లేవ్
యూపీ జల్ నిగమ్ (అర్బన్)లోని 4,300 మంది ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. మరో 6,800 రిటైర్డ్ ఉద్యోగులకూ పింఛన్లు ఆగిపోయాయి. యూపీ జల్ నిగమ్ (రూరల్)లోని వేలాది ఉద్యోగులకూ గత మూడు నెలలుగా వేతనాలు నిలిపేశారు. ఇక, మునిసిపల్ కార్సొరేషన్లకు ఇటీవలే బదిలీ అయిన 1,238 మంది ఫీల్డ్ స్టాఫ్కు ఆరు నెలలుగా శాలరీలు లేవు. మొత్తంగా 20 వేల మంది ఉద్యోగులకు, పింఛన్దారులకు వేతనాలు నిలిచిపోయాయి.
– డీపీ మిశ్రా, జల్ నిగమ్ ఎంప్లాయీస్ కో-ఆర్డినేషన్ కమిటీ ప్రధాన ప్రతినిధి