(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘మాతృభూమిని రక్షించే క్రమంలో 20 మంది భరతమాత బిడ్డలు గల్వాన్ లోయలో అమరులయ్యారు. సైనికుల ప్రాణ త్యాగాలు వృథా కాబోవని మాటిస్తున్నా. భారత్ శాంతికాముక దేశం. ఎవరైనా రెచ్చగొడితే మాత్రం తగిన బుద్ధి చెప్తాం’.. 2020, జూన్ 17న రాష్ర్టాల సీఎంలతో జరిగిన వీడియో సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలివి. నేటికి దాదాపు రెండున్నరేండ్లు గడిచింది. గల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల ప్రాణాలకు విలువ లేకుండా పోతున్నది. గల్వాన్పై సార్వభౌమాధికారం తమదేనని చైనా ప్రకటించినా, అదే గల్వాన్లో చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసినా, పాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మించినా, అరుణాచల్, లఢక్లు తమవేనని చైనా మ్యాప్ ప్రదర్శించినా.. ఇలా ఎన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మోదీ సర్కార్ కిక్కురమనడం లేదు. ఘాటైన సమాధానం ఇవ్వకుండా మొక్కుబడి ప్రకటనలు చేస్తున్నది. ఇప్పుడు తాజాగా గల్వాన్ ఘర్షణలు తమ అధ్యక్షుడు జిన్పింగ్ ఘనతేనని చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది.
చైనాను అన్ని విధాలుగా అడ్డుకుంటామన్న మోదీ.. డ్రాగన్కు తగిన బుద్ధి చెప్పకుండా మౌనముద్రతో జపం చేస్తున్నారు. ఎంతగా అంటే.. గల్వాన్ ఘర్షణలు తమ అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఘనతేనని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) ప్రచారం చేసుకొంటున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఖండించట్లేదు. 2020లో గల్వాన్ సరిహద్దుల్లో జరిగిన సైనిక ఘర్షణలు అధ్యక్షుడు జిన్పింగ్ ఘనతగా ఆదివారం జరిగిన సీసీపీ 20వ జాతీయ మహాసభ అభివర్ణించింది. ఘర్షణకు కారణమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) కమాండర్ క్వి ఫబావ్ను సమావేశాలకు ఆహ్వానించడమే కాకుండా.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. క్వి ఫబావ్ రెండు చేతులు అడ్డుపెట్టి అప్పటి ఘటనలో భారత దళాలను నిలువరిస్తున్నారంటూ ఓ దృశ్యాన్ని ప్రదర్శించింది. అయినప్పటికీ, చైనా వైఖరిపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఎలాంటి జవాబు ఇవ్వకపోవడంపై విపక్షాలతో పాటు బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా మండిపడుతున్నారు.
జాతి ప్రయోజనాలకు ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారు. ఎస్సీవో సదస్సులో భారత భూభాగాలను తమవిగా చూపిస్తూ చైనా కరపత్రాలు పంచింది. మోదీకి కూడా ఆ మ్యాప్ అందింది. అయినప్పటికీ, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 18 దఫాల చర్చలు జరిగాక, ఇరు దేశాల బలగాలు ఘర్షణల ప్రాంతం నుంచి వెనక్కి వచ్చాక ఇప్పుడు గల్వాన్ తమ విజయంగా చైనా ప్రచారం చేసుకొంటున్నది. ఇది భరతమాతను అవహేళన చేయడమే. 20 మంది జవాన్లను కోల్పోయి, బలగాలను ఉపసంహరించి గల్వాన్ను చైనాకు బహుమతిగా ఇచ్చామా? దీనిపై మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
– సుబ్రమణ్యస్వామి, బీజేపీ సీనియర్ నేత