సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో 20 మంది రెబల్స్ సంప్రదింపులు
మీడియాలో కథనాలు.. రెబల్స్ టచ్లో ఉన్నారన్న రౌత్
అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టులో షిండే పిటిషన్
మహారాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తల ఆందోళనలు
షిండే క్యాంపు హోటల్కు అస్సాం బీజేపీ మంత్రులు
ముంబై/గువాహటి, జూన్ 26: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్నది. పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. అస్సాంలోని గువాహటిలో ఓ హోటల్ ఉన్న ఏక్నాథ్ షిండే క్యాంపులోని తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 20 మంది శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో టచ్లోకి వచ్చినట్టు మీడియాతో పాటు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏక్నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నట్టుగా బీజేపీతో శివసేన కలవాలనే డిమాండ్ను కొంతమంది రెబల్స్ వ్యతిరేకిస్తున్నట్టు తెలిపాయి. షిండే ప్రతిపాదనపై వారి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నాయి. ఇదే సమయంలో వెనక్కు వచ్చే వారికి పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని, చాలా మంది ఎమ్మెల్యేలతో తాను టచ్లో ఉన్నానని, రెబల్స్ గ్రూపులో కూడా తిరుగుబాటు ఉండొచ్చని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆదివారం వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. తమతో 12-14 మంది రెబల్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆదిత్య ఠాక్రే కూడా అన్నారు. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఆదివారం ముంబైలోని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు.
బుజ్జగింపుల ప్రయత్నాల్లో ఠాక్రే భార్య
రెబల్ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు ఠాక్రే కుటుంబసభ్యులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. అసమ్మతి నేతల భార్యలతో చర్చలు జరుపుతున్నారు. వారి భర్తలను ఎలాగైనా రాజీకి వచ్చేలా చేయాలని ఆమె కోరుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై-ప్లస్ సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. మహారాష్ట్రలోని వారి కుటుంబాలకు కూడా రక్షణ కల్పించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖకు సెక్యూరిటీ ఏజెన్సీలు చేసిన సిఫార్సుల ఆధారంగా భద్రత మంజూరు చేసినట్టు తెలిపారు. రెబల్స్ తిరిగి రావడంపై స్పష్టత లేదని, అయితే ఎయిర్పోర్టుల అప్రమత్తం వంటి ముందస్తు చర్యలు చేపడుతున్నామని ముంబై పోలీసులు తెలిపారు.
వారిని చెప్పులతో కొట్టాలి
రెబల్స్పై వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ముంబైలో బైక్ ర్యాలీ చేపట్టారు. ‘జోడే మారో(చెప్పులతో కొట్టాలి)’ అంటూ శివసైనికులు పుణెలో ఆందోళనలు చేశారు. రెబల్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ద్రోహులను క్షమించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షిండే ఫొటోను చెప్పులతో కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నగరానికి చెందిన కొంతమంది శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ముంబైలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ రెబల్ ఎమ్మెల్యేలకు అసంబద్ధ ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. రెబల్స్ను ఖైదీల మాదిరిగా గువాహటి తీసుకెళ్లారని, దీని వెనుక కేంద్రంలో, రాష్ట్రంలో (అస్సాంలో) అధికారంలో ఉన్న బీజేపీ ఉన్నదని పేర్కొన్నారు. ఎంవీఏ ప్రభుత్వం మరో 2-3 రోజులే ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత రావ్సాహెబ్ ధన్వే వ్యాఖ్యానించారు. రెబల్స్ ఉంటున్న గువాహటిలోని హోటల్కు అస్సాం మంత్రులు అశోక్ సింఘాల్, పిజుష్ హజరికా వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
సుప్రీంకు ‘మహా’పంచాయితీ
తనతో పాటు మరో 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీచేయడంపై ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జేబీ పర్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ చేసే అవకాశం ఉన్నది. మహారాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటేరియట్ శనివారం 16 మంది ఎమ్మెల్యేలకు సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అనర్హత వేటు వేయాలని వచ్చిన ఫిర్యాదులపై 27వ తేదీ సాయంత్రంలోగా రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని కోరింది.