పాట్నా: బీహార్లో కల్తీ మద్యం తాగి 20 మంది మరణించారు. ఈ ఘటన సరన్ జిల్లాలోని ఛాప్రా ప్రాంతంలో చోటుచేసుకున్నది. కొందరు మంగళవారం రాత్రి కల్తీ మద్యాన్ని (నాటు సారా) తాగి, ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమీప దవాఖానకు తరలిస్తుండగా కొంతమంది మరణించారు. చికిత్స పొందుతూ ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇప్పటికీ కొంతమంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరుగొచ్చని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు కల్తీ మద్యంపై అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం నితీశ్కుమార్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో కలుగజేసుకున్న స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.