పనాజీ : గోవాలో అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న 20 మందికిపైగా బంగ్లాదేశ్ జాతీయులను అరెస్ట్ చేశారు. గత రెండు నెలల్లో అద్దెదారులు, విదేశీయుల వెరిఫికేషన్లో భాగంగా గోవా పోలీస్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించింది. విచారణ అనంతరం అందరినీ అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదివారం ధ్రువీకరించారు. సదరు వ్యక్తుల భారతీయ చిరునామాకు సంబంధించిన గుర్తింపు కార్డులు లేవీ లేవని తెలిపారు. అరెస్టులకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
స్థానికంగా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించేందుకు తీర ప్రాంతంలో అన్వేషణ కొనసాగుతుందని చెప్పారు. ఇంతకు ముందు ఏటీఎస్ ఎస్పీ శోభిత్ సక్సేనా విలేకరులతో మాట్లాడుతూ బంగ్లా జాతీయులు నకిలీ పత్రాలను ఉపయోగించి అక్రమంగా నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. గత నాలుగైదేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారని, వారి నుంచి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో వాటిని తయారు చేశారని చెప్పారు. సదరు వ్యక్తులను ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఎదుట హాజరుపరిచామని, వారి కదలికలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంపై నివేదికను సిద్ధం చేసి, హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు పంపున్నట్లు వివరించారు.