న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికలకు ముందు గోవాలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మిత్రపక్షమైన మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (MGP) బెంగాల్ సీఎం మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. ఈ విషయాన్ని ఎంజీపీ అధ్యక్షుడు దీపపక్ ధవలికర్ సోమవారం మీడియా ఎదుట ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీతో పొత్తు పెట్టుకోవాలని తమ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించేందుకు టీఎంసీతో చేతులు కలిపామన్నారు. మహాకూటమి ముఖ్యమంత్రి పదవిపై పార్టీలు తర్వాత నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా వేవ్ ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2019లో బీజేపీతో పొత్తు తెంచుకున్నామని, తాము ఎప్పుడూ బీజేపీని విమర్శిస్తూనే ఉన్నామన్నారు. 2017 ఎన్నికల్లో ఎంజీపీ గోవా అసెంబ్లీలోని 40 సీట్లలో మూడింటిని గెలుచుకున్నది.
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలు అధికారికంగా బీజేపీలో చేరిన అనంతరం.. ప్రస్తుతం పార్టీలో ఒకరే ఎమ్మెల్యే ఉన్నారు. గోవా అసెంబ్లీకి వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు టీఎంసీ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మిత్రపక్షాల కోసం ప్రయత్నాలు చేస్తున్నది. టీఎంసీ మొదట గోవా ఫార్వర్డ్ పార్టీ మద్దతు కోరింది. అయితే, గతవారం విజయ్ సర్దేశాయ్ నేతృత్వంలోని పార్టీ కాంగ్రెస్తో చేతులు కలిపింది.