Army Shot on Villagers | అరుణాచల్ప్రదేశ్లో సైన్యం పొరపాటున ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపింది. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్లోని తిరప్ జిల్లాలో చోటు చేసుకుంది. ఛాసా గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం నదిలో చేపలు పట్టుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిని నోక్ఫ్యాయ వాంగడన్ (28), రామ్వాంగ్ వాంగ్సు (23)గా గుర్తించారు. క్షతగాత్రులైన వారిద్దరిని చికిత్స కోసం దిబ్రూగఢ్లోని అసోం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు.
ఈ ఘటన పొరపాటున జరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల్లో ఒకరి మోచేతికి, మరొకరి కాలికి గాయమైందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత దిహింగియా చెప్పారు. ప్రస్తుతం వారి ప్రాణాలకు ముప్పేమి లేదన్నారు.
క్షతగాత్రుల వెంట దవాఖానకు వచ్చిన గ్రామస్తుడు మాట్లాడుతూ తమ గ్రామస్తులపై సైనికులు కాల్పులు జరిపారని చెప్పారు. వారిద్దరూ అనాధలని, ఒకరి చేతికి గాయమైతే, మరొకరి కాలికి గాయమైందని తెలిపాడు. వారిద్దరి కోసం ప్రభుత్వం ఏదైనా చేయాలని సూచించాడు. సైన్యం పనితీరుపై బీజేపీ తిరప్ జిల్లా అధ్యక్షుడు కంరంగ్ తెసియా స్పందించారు. స్థానికులకు భద్రత కల్పించడానికి బదులు కాల్పులు జరపడం అర్థం లేని చర్య అని వ్యాఖ్యానించారు. సరైన నిఘా సమాచారం లేకుండా కాల్పులు జరుపడం వల్ల సైన్యం విశ్వసనీయత కోల్పోతున్నదన్నారు.