న్యూఢిల్లీ: రెండు అనుమానాస్పద బ్యాగులు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. త్రిలోక్పురి ప్రాంతంలో రెండు అనుమానాస్పద బ్యాగులు ఉన్నట్లు బుధవారం ఉదయం పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో బాంబ్ డిస్పొజబుల్ స్క్వాడ్ వెంటనే అక్కడకు వెళ్లింది. అనుమానిత బ్యాగులను దూరంగా తరలించి తనిఖీ చేశారు. అయితే అందులో ఎలాంటి బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, ఈ రెండు బ్యాగులను ఎవరో చోరీ చేసి అక్కడ వదిలేసి ఉంటారని తూర్పు ఢిల్లీ డీసీపీ ప్రియాంక కశ్యప్ తెలిపారు. బ్యాగుల యజమానులను గుర్తించినట్లు చెప్పారు. ఆ బ్యాగులను వారికి అందజేస్తామని వెల్లడించారు.
మరోవైపు, ఢిల్లీ శివారులోని ఘాజియాబాద్ పూల మార్కెట్లో ఇటీవల ఒక అనుమానాస్పద బ్యాగును గుర్తించారు. అందులో పేలుడు పదార్థం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ డిస్పొజబుల్ స్క్వాడ్ దానిని దూరంగా తీసుకెళ్లి సురక్షితంగా పేల్చివేసింది. ఈ ఘటనతోపాటు రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో ఢిల్లీ పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు.